ఇండియా vs ఆస్ట్రేలియా: మొదటి ODI కోసం కష్టపడుతున్న ధోనీ, ధావన్

Share this story



ఇండియా vs ఆస్ట్రేలియా యొక్క మొదటి వన్ డే ఇంటర్నేషనల్ (ODI) కోసం మన క్రికెట్ జట్టు బాగానే కష్టపడుతున్నట్లు గా కనిపిస్తోంది. ఈ మధ్యనే జరిగిన టెస్ట్ సిరీస్ లో తమ సత్తా చాటి, కప్ ని కైవసం చేసుకున్న మన భారత జట్టు, ఇప్పుడు జరగనున్న ODI లపై తన దృష్టిని కేంద్రీకరించింది.ఇందులో భాగంగా జరుగుతున్న వార్మ్ అప్ ట్రైనింగ్ లలో మన కుర్రాళ్లు చురుగ్గా పాల్గొని తమ ఆట తీరును బలపర్చుకుంటున్నారు. ఇదిలా ఉండగా, ఇవాళ మన ఛాంపియన్ బ్యాట్స్ మాన్ అయినటువంటి మహేంద్ర సింగ్ ధోని ఇంకా చక్కని షాట్ లతో మ్యాచ్ లను తన వైపు తిప్పుకొనే శిఖర్ ధావన్ లు ఇరువురు ఆస్ట్రేలియా లోని సిడ్నీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం లో ప్రాక్టీస్ చేస్తూ కెమెరా లకు చిక్కారు.

వీరికి తోడు గా మన తెలుగు క్రికెట్ సూపర్ స్టార్ అంబటి రాయుడు కూడా ట్రైనింగ్ లో పాలుపంచుకున్నారు. అయితే, ఇదంతా ఒక ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్ కావడం విశేషం. అంటే, ఎలాగైనా ఆస్ట్రేలియా పై జరిగే ఈ మొదటి వన్ డే ఇంటర్నేషనల్ పోరు లో తమ సత్తా చాటాలని మన క్రికెట్ టీం చాలా తాపత్రయం పడుతోందని సుస్పష్టంగా మనకు అర్ధం అవుతోంది.

మూడు మ్యాచ్ లుగా సాగనున్న ఈ వన్ డే ఇంటర్నేషనల్ సిరీస్, సిడ్నీ ఇంటర్నేషనల్ క్రికెట్ గ్రౌండ్ లో ఈ జనవరి పన్నెండవ (12 వ) తారీఖున జరగనున్న మొదటి మ్యాచ్ లో ప్రారంభం కానుంది. అయితే, ఈ ఇరు జట్ల మధ్య రెండవ మ్యాచ్ జనవరి 15 వ తేదీన అడిలైడ్ లో జరగడానికి షెడ్యూల్ చేయబడగా, ఈ సిరీస్ లోని మూడవది మరియు చివరి మ్యాచ్ జనవరి 18 వ తేదీన మెల్బోర్న్ క్రికెట్ గ్రౌండ్ లో జరగనుంది.

ఈ 2019 వ సంవత్సరం భరత క్రికెట్ జట్టు కి బాగానే కలిసి వచ్చిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే, మొన్న మన జట్టు సాధించిన టెస్ట్ సిరీస్ విజయం మామూలుది ఏం కాదండోయ్. ఇప్పటి వరకు ఆసియా ఖండం లో ఉన్న ఏ ఒక్క దేశం క్రికెట్ జట్టు కూడా ఆస్ట్రేలియా గడ్డ పై ఒక్క టెస్ట్ సిరీస్ ని కూడా గెలవలేకపోయింది అంటే నమ్మండి.

ఇప్పుడు ఆ ఘనతను సాధించిన ఏకైక దేశం గా, ఏకైక క్రికెట్ జట్టు గా భారత జట్టు చరిత్రలో నిలిచి పోయింది. అయితే, ఇదంతా మన అద్భుత ఛాంపియన్ అయినటువంటి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ లో సాధించడం చెప్పుకోవాల్సిన విషయం. అందుకే, ఇప్పుడు అందరి కళ్లు విరాట్ కోహ్లీ సేన వరల్డ్ కప్ లో ఎలా ఆడతారో అన్నదాని పై కేంద్రీకృతం అయి ఉన్నాయి.

ఇక మన హెలికాప్టర్ షాట్ సృష్టి కర్త అయిన మహేంద్ర సింగ్ ధోనీ విషయానికి వస్తే, 2018 వ సంవత్సరం అతనికి పెద్దగా కలిసి రాలేదనే మనం చెప్పుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే, పోయిన సంవత్సరం లో జరిగిన ఇరవై వన్ డే ఇంటెర్నేషనల్స్ లో పాల్గొన్న మన ధోనీ కేవలం రెండు వందల డెబ్భై అయిదు (275) పరుగులు మాత్రమే సాధించాడు.

అయితే, ప్రస్తుతం జరగనున్న మ్యాచ్ లపై చాలానే ఫోకస్ చేస్తున్నట్లుగా కనిపిస్తున్నాడు మన ఆల్ రౌండ్ ఛాంపియన్. ఈ సంవత్సరం వరల్డ్ కప్ జరగనుండడం తో అందరి చూపు ఇప్పుడు మనోడి పై పడిందనే చెప్పుకోవాలి. 2014 వ సంవత్సరం లో ఆస్ట్రేలియా గడ్డ పై నుండి టెస్ట్ సిరీస్ కి స్వస్తి అంటే రిటైర్మెంట్ ప్రకటించిన ఎం.స్ ధోనీ, ఇప్పుడు ODI ఇంటెర్నేషనల్స్ కి తాను ఇంకా ఫిట్ గానే ఉన్నానని నిరూపించుకుని విమర్శకుల నోర్లు మూయించడానికి తాపత్రయ పడుతున్నాడు.